అమెరికాతో మళ్లీ చర్చలా.. అసంభవం: తేల్చి చెప్పిన కిమ్​ సోదరి

  • అమెరికావి తప్పుడు ఊహలన్న కిమ్ యో జోంగ్
  • భారీ అసంతృప్తి తప్పదని హెచ్చరిక
  • ఇటీవలే చర్చలు, పోరాటానికి సిద్ధం కావాలన్న కిమ్ జోంగ్ ఉన్
అమెరికాతో మళ్లీ చర్చలు జరిపే ప్రసక్తే లేదని, చర్చల కోసం ఆ దేశం కలలు కంటోందని ఉత్తర కొరియా లీడర్ కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ మండిపడ్డారు. ఆ దేశంతో చర్చలు అసంభవమన్నారు. ఈ మేరకు ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఉత్తర కొరియా అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణి కార్యక్రమాలను వదులుకునేలా దౌత్యపర చర్యలు సహా అన్ని ప్రాక్టికల్ చర్యలకు సిద్ధమని ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. దీంతో గత వారం జరిగిన సమావేశంలో అమెరికాతో చర్చలు, పోరాటం.. రెండింటికీ సిద్ధంగా ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ తన అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్.. అది ఎంత వరకు ముందుకెళ్తుందో వేచి చూడాలన్నారు.

ఇప్పుడు ఆయన వ్యాఖ్యలకు యో జోంగ్ కౌంటర్ ఇచ్చారు. అమెరికా తనకు తానే ఏవేవో ఊహించుకుంటోందన్నారు. అమెరికా అంచనాలన్నీ తప్పేనన్నారు. ఆ ఊహల్లోనే ఉంటే పెద్ద అసంతృప్తిలో మునిగిపోవాల్సి వస్తుందని సూచించారు.

North Korea
Kim Jong Un
Kim Yo Jong
USA

More Telugu News